కార్తీక మహాపురాణము
పదవ మరియు పదకొండవ అధ్యాయాలు పారాయణం
04-11-2022
కార్తిక శుద్ధ ఏకాదశి, శుక్రవారం.

ప్రభోధిని ఏకాదశి/ఉత్థాన ఏకాదశి/ప్రబోధిని ఏకాదశి పర్వదినం.
శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది
కార్తీకంలో ప్రతీరోజుకు ఒక్క ప్రత్యేకత. ముఖ్యంగా కార్తీకదామోదర మాసంగా పేరుగాంచిన ఈ మాసంలో ఈరోజు నాటి ఏకాదశి మరింత విశిష్టత కలిగి ఉంది.
తొలి ఏకాదశిగా పేరుగాంచిన ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు.
కార్తీకశుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతారు.
విష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తోలిగిపోతుంది. విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇచ్చే హారతిని చూడండి, స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. బ్రహ్మదేవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన ఏకాదశి మహత్యాన్ని గురించిన విశేషాలు స్కాందపురాణంలో వివరించబడింది.
ఏకాదశి ఫలితాలు ఇవే !
ఈ ఏకాదశి సర్వపాపాలను హరిస్తుంది. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేలజన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది.
ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది’ అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు. ఏకాదశి వ్రతం చేసినవారు ఒకరికి అన్నదానం చేయడం వలన పవిత్ర గంగానదీ తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది.
వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.