ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి
" నవగ్రహ పీడా పరిహార స్తోత్రం " వినండి
కార్తీక మహాపురాణము ఇరవైఆరవ రోజు పారాయణం
"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి ఇరవైఆరవ రోజు అధ్యాయం వినండి
నవగ్రహ స్తోత్రం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥
నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥
ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।
ఇరువది ఆరవ రోజు పారాయణము
ఏకవింశాధ్యాయము
విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత ఛేష్ఠుడూ, విస్మయ రూపుడూ అయినా ధర్మ దత్తుడు పునఃవారికి ప్రణామాచరించి 'ఓ విష్ణుస్వరూపులారా! ఆ జనానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి' అని వేడుకున్న మీదట, విష్ణుగణాలు అతడిని ఇలా సమాధానపరచసాగాయి.
పాపరహితుడైన బ్రాహ్మణుడా! నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను.
పూర్వం కాంచీపురాన్ని 'చోళుడు' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్థంభాలతో తామ్రపర్ణినది యొక్క రెండు తీరాలూ కూడా కుబేరోద్యానవనాలైన 'చైత్రరథా'ల వలే ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొకనాఁడు 'అనంతశయన 'మనే పేర యోగనిద్రా ముద్రితుడై వుండే విష్ణ్వాలయానికి వెళ్లి, మణిమౌక్తిక సువర్ణపుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే 'విష్ణుదాసు' డనే బ్రాహ్మణుడొకడు విష్ణ్వార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీదళాలతోనూ, గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తానూ ధర్మవేత్తయై కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, 'ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా? అని చీదరించుకున్నాడు. ఆ మాటలకి కోపం వచ్చి అవతలి వ్యక్తి 'రాజు' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి 'ఓ రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా! రాజ్యఐశ్వర్య మత్తుడవై వున్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు' అని ఎదిరించాడు.
అతని మాటలకూ అవహేళనగా నవ్వుతూ 'నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దరిద్రుడవూ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా వుంది.
ఓ సదస్యులారా! సత్ప్రహ్మణులారా! శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో, ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది' అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్లి 'ముద్గలుడు' అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది. అన్నదానాలూ, అనేకానేక దక్షిణలతో, సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిదీ, సర్వసమృద్ధిమంతమైనదీ అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు
పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ తులసీవన సంరక్షణలూ, ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలనూ, నృత్యగీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ, ఈ విధంగా తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యమూ సర్వవేళలలోనూ, భోజనాది సమయాలలోనూ, సంచారమందూ, తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాలలో విశేష నియమ పాలనని ఆచరిస్తూ వున్నాడు.
ఆ విధంగా భక్తులైన చోళ, విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలనూ వ్రత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే వుండిపోయారు.
ఇరువది ఒకటవ అధ్యాయము
ద్వావింశోధ్యాయః
కాలం గడుస్తూ వుండగా, ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్లిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించి పోతూండటం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణుపూజకు వేళపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతీ రోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే వున్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు.
వారం రోజుల పాటు అభోజనముగా వుండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాల పెందలాడే ముగించుకుని, వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తానో చాటున దాగి కూర్చుని, దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా వుంది. రక్తమాంసాలే మాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా వున్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛండాలుడు వంటకాలను దొంగిలించుకు పోసాగాడు.
అతని దైన్యహైన్యస్థితిని చూసి, అప్పటికే కరుణాభరితమైన హృదయంతో వున్న బ్రాహ్మణుడు 'ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని ఆలా వట్టిగా తినడం కష్టం. ఈ నీటిని కూడా పట్టుకుని వెళ్ళు ' అంటూ నేతి ఝారీతో సహా అతని వెంటపడ్డాడు.
ఈ విప్రుడు తనను బంధించి రాజభటులు అప్పగించుతాడనే భయంతో ఆ ఛండాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరుగెడుతూ ' అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్లి కలుపుకుని తినవయ్యా స్వామీ' అని అరుస్తూనే వున్నాడు. అసలే అలసటగా వున్నా ఛండాలుడు భయం వలన నేలనపడి మూర్చపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు ' అయ్యో! మూర్ఛపోయావా మహాత్మా! అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు.
ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న ఛండాలుడు - చిరునవ్వు నవ్వుతూ లేచాడు.
ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాబ్జాధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ శ్రీవత్సలాంచితుడూ, కౌస్తుభాలంకృతుడూ అయినా శ్రీమన్నారాయణుని వలే గోచరించడంతో అతగాడు. స్వాత్త్వికభావా వృతుడై పోయి అవాక్కుగా వుండిపోయాడు. ఆ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీదా, విష్ణుదాసుడి మీదా కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండి ఉన్నట్లనిపించింది. అనంతరమా ఆదినారాయణుడు విష్ణుదాసుని గ్రుచ్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానమెక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞ వాటికలో వున్న చోళుడు గగనగాములైన
బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్య పోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి 'ఓ ముద్గరమునీ! నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు, అమితైశ్వర్యవంతుడైన నేను అసాధ్యాలయిన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే గదా!
నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులూ కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణ్వనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను, అని చెప్పాడు బాల్యం నుంచీ యజ్ఞ దీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.
శ్లో ||
తస్మాదద్యాపి తద్దేశే సదా రాజ్యాంశ భాగినః | స్వా స్రీయా ఏవ జాయంతే తత్కృతానిధి వర్తినః ||
ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతూ వున్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి 'ఓ శ్రీహరీ! త్రికరణ శుద్ధిగా నీ యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రీ!' అని ప్రార్థించి -సమస్తసదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం మాచరించాడు.
శ్లో ||
ముద్గలస్తూ అతః క్రోథా చ్చిఖ ముత్పాటయిన్ స్వకాం అత స్త్వ ద్యాపి తద్దోత్రే ముద్గలా విశిఖా భవన్ ||
అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రమీనాటికి 'విశిఖా' గానే వర్థిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ననుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్లిపోయాడు.
ఓ ధర్మదత్తా! అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్రహించి, సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి
ఓ విప్రుడా! విష్ణ్వనుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా వున్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం' అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు.
ఇరువది ఒకటి, ఇరువది రెండు - అధ్యాయములు ఇరువది ఆరవ (బహుళ ఏకాదశి) రోజు పారాయణము సమాప్తము